పత్తి ధరలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి తెల్లబంగారం ధరలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. ఇంటర్నేషన్ మార్కెట్లో తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండటంతో మన దగ్గర వ్యాపారులు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కు పత్తిని అమ్మేందుకు రైతులెవరూ ఆసక్తి చూపడం లేదు. పత్తికి కేంద్ర ప్రభుత్వం రూ.6025 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా పత్తిలో తేమ 8 శాతం మాత్రమే ఉంటే వర్తిస్తోంది. అయితే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం కొంత అటూ ఇటు అయినా కూడా రూ.7000 వేలకు మించి కొనుగోలు చేశారు.
కొత్త గూడెంలో రూ.10,200 రికార్డ్ ధరపత్తి ధరలు ఈ సారి మొదటి నుంచి బాగానే ఉన్నాయి. పత్తిని తెలంగాణలో వాణిజ్యపంటగా అధికంగా పండిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. పత్తి కొనుగోలు ప్రారంభమైన దగ్గరి నుంచి మద్దతు ధర కంటే అధికంగా చెల్లించిన వ్యాపారులు.. మధ్యలో కొంత తగ్గించేశారు. ఇక రైతుల వద్ద పత్తి అయిపోయే సమయంలో మళ్లీ ధరలు పెంచారు. నిన్న భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని జూలురుపాడెం మార్కెట్ లో యార్డ్ లో ఏకంగా క్వింటాలుకు రూ. 10,200 ధర పలికింది. ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా రూ. 9,660 ధర పలికింది. ఇంత వరకు ఇంత ఎక్కుమ మొత్తంలో ధరలు ఎప్పుడూ పలకలేదు. జూలూరుపాలెం మార్కెట్ యార్డు ఏపీకి కూడా దగ్గర ఉండటంతో ఆ మార్కెట్ పక్క రాష్ట్రం నుంచి కూడా రైతులు పత్తి తీసుకువచ్చారు. వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేయడంతో రైతులకు ఆ ధర దక్కింది.
రైతుల వద్ద పత్తి లేని సమయంలో పెరుగుతున్న ధరలు..పత్తి రైతులు దసరా సమయం నుంచి పత్తిని సేకరించడం ప్రారంభిస్తారు. అలా సేకరించిన పత్తిని వెనువెంటనే మార్కెట్ యార్డుకు తరలించి అమ్మేస్తుంటారు. అయితే మొదటల్లోనే కేంద్ర ప్రభుత్వం 8 శాతం పత్తి తేమ ఉంటే రూ. 6,025 మద్దతు ధర కల్పిస్తామని చెప్పింది. గతేడాది ధరతో పోల్చితే ఇది కొంత మెరుగైన ధరగానే భావించాలి. కానీ ప్రతీ సంవత్సరం మద్దతు ధర కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే పత్తి వ్యాపారులు ఈ సారి మొదటి నుంచి ధరను అధికంగా చెల్లించారు. మద్దతు ధర కంటే ఎక్కువగానే ఇచ్చారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 6,025 ఉన్న సమయంలోనే వ్యాపారులు రూ.7000 నుంచి మొదలుకొని రూ. 7,800 మధ్య మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశారు. ఒక దశలో రూ.8,200 నుంచి 8,500 వరకు కూడా ధర ఇచ్చి కొనుగోలు చశారు. అయితే దాదాపు రైతుల వద్ద పత్తి నిల్వలు అయిపోయిన తరువాత ఇప్పుడు ధరలను మళ్లీ పెంచారు. ఇప్పుడు సేకరించే పత్తి చాలా తక్కువ బరువు ఉంటుంది. ఇప్పుడు పెరిగిన ధర వల్ల చాలా తక్కువ మందికి రైతులకు మాత్రమే లబ్ది చేకూరుస్తోంది.
0 Comments